కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగింది. ఐదో తరగతికి చెందిన విద్యార్థులు నీటికుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. తోటి చిన్నారులు స్థానికులకు సమాచారం అందించడంతో గ్రామస్థులు నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు...ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.