గుడ్‌న్యూస్‌.. ఉగాది రోజున ల‌క్ష మంది ల‌బ్దిదారులకు టిడ్కో ఇళ్లు

వ‌చ్చే ఉగాది రోజు రాష్ట్రంలో ల‌క్ష మంది ల‌బ్దిదారులకు టిడ్కో ఇళ్లు అంద‌జేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 5 March 2026 6:50 PM IST

గుడ్‌న్యూస్‌.. ఉగాది రోజున ల‌క్ష మంది ల‌బ్దిదారులకు టిడ్కో ఇళ్లు

వ‌చ్చే ఉగాది రోజు రాష్ట్రంలో ల‌క్ష మంది ల‌బ్దిదారులకు టిడ్కో ఇళ్లు అంద‌జేస్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్ల ను పూర్తి చేయ‌డంతో పాటు 2028 క‌ల్లా ప్ర‌జ‌లంద‌రికీ సుర‌క్షిత‌మైన తాగునీరు అందించేలా ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకెళ్తున్నామ‌ని మంత్రి చెప్పారు..గౌర‌వ ముఖ్య‌మంత్రి గారి స‌ల‌హాలు,సూచ‌న‌ల‌తో పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ద్వారా ప్ర‌జ‌ల‌కు విస్తృతంగా మెరుగైన సేవ‌లు అందిస్తున్నామ‌ని అన్నారు..శాస‌న‌స‌భ‌లో సాధార‌ణ బ‌డ్జెట్ డిమాండ్స్ పై చ‌ర్చ సంద‌ర్భంగా త‌న శాఖ‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు..

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో జ‌నాభా రోజురోజుకూ పెరుగుతుందని.. 2001 లో 24.2 శాతం జ‌నాభా ఉంటే 2011 నాటికి ప్ర‌స్తుతం 36 శాతం ఉన్న‌ద‌ని.. 2047 నాటికి ఇది 60 శాతానికి పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ అంచనాల‌కు అనుగుణంగా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నామ‌న్నారు.. 2014-19 మ‌ధ్య కాలంలో మున్సిపాల్టీల నుంచి ప‌న్నుల రూపంలో వ‌చ్చే నిధుల‌ను గ్రీన్ ఛాన‌ల్ ద్వారా ఆయా మున్సిపాల్టీల‌కే ఖ‌ర్చు పెట్టామ‌న్నారు. కానీ గ‌త ప్ర‌భుత్వం మున్సిపాల్టీల నిధుల‌ను కూడా సొంత‌ అవ‌స‌రాల‌కు వినియోగించేసుకుంద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు గారు చొర‌వ తీసుకుని తిరిగి సీఎఫ్ఎంఎస్ తో సంబంధం లేకుండా మున్సిపాల్టీల నిధులు అక్క‌డే ఖ‌ర్చు చేసుకునేలా మార్పులు చేసార‌ని అన్నారు.. సీఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు మంత్రి నారాయ‌ణ‌..

ఈ బ‌డ్జెట్ లో మున్సిప‌ల్ శాఖ‌కు 14,538.68 కోట్లు కేటాయింపులు చేసారని..గ‌త బ‌డ్జెట్ కంటే ఇది 4.88 శాతం ఎక్కువ అన్నారు. ప్ర‌జ‌లు కోరుకునే తాగునీరు,ఘ‌న‌,ద్ర‌వ వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌,రోడ్లు,వీధి లైట్ల‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల‌ను ప్రాధాన్య‌తాక్ర‌మంలో క‌ల్పిస్తున్నామ‌న్నారు నారాయ‌ణ‌. రాష్ట్రంలో 54,98,000 కొళాయి క‌నెక్ష‌న్లు ద్వారా 3083 ఎంఎల్డీ తాగునీరు అందించాల్సి ఉండ‌గా.. ప్ర‌స్తుతం 38.48 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్ల ద్వారా 2100 ఎంఎల్టీ నీరు అందిస్తున్నామ‌న్నారు.. మ‌రో 16.5 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్ల ద్వారా 983 ఎంఎల్డీ తాగు నీరు అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వీటిలో వివిధ ప‌థ‌కాల ద్వారా 941 ఎంఎల్డీల తాగు నీరు అందించేలా టెండ‌ర్లు పిలిచామ‌న్నారు. అమృత్ ప‌థ‌కం ద్వారా 6,524 కోట్ల‌తో ఏఐఐబీ ప్రాజెక్ట్ ద్వారా 2,461 కోట్ల‌తో,యూఐడీఎఫ్ - 1 ప‌థ‌కం ద్వారా 1504 కోట్ల‌తో ప‌నులు ప్రారంభించేందుకు టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు.మొత్తంగా 11,937 కోట్ల‌తో ప్రాజెక్ట్ చేప‌ట్టిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

గ‌త ప్ర‌భుత్వం వివిధ కేంద్ర ప‌థ‌కాల‌కు రాష్ట్ర వాటా నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో తాగు నీటి ప్రాజెక్ట్ లు పూర్తి కాలేద‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు. ఏఐఐబీ ద్వారా 2019 లో 5350 కోట్ల నిధులు విడుద‌ల‌యితే గ‌త ప్ర‌భుత్వం మ్యాచింగ్ ఫండ్స్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఆ నిధులు విడుద‌ల కాలేద‌న్నారు. అలాగే అమృత్ ద్వారా 8500 కోట్ల‌కు రాష్ట్ర వాటా నిధులు విడుద‌ల చేయ‌లేద‌న్నారు. తిరిగి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేంద్రంతో మాట్లాడి ఆయా ప‌థ‌కాల నిధులు విడుద‌ల చేయించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

గ‌త ప్ర‌భుత్వం చెత్త ప‌న్ను వేసి చెత్త‌ను మాత్రం తొల‌గించ‌కుండా వెళ్లిపోయింద‌ని మంత్రి ఆరోపించారు. భూమిపైన 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు,భూమి క్రింద 68 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త క‌లిపి మొత్తం 153 ల‌క్ష‌ల ట‌న్నుల చెత్త వ‌దిలివెళ్లిపోయింద‌న్నారు. 2024 అక్టోబ‌ర్ లో గౌర‌వ ముఖ్య‌మంత్రి గారి ఆదేశాల ప్ర‌కారం ఏడాదిలోగా 85 ల‌క్ష‌ల ట‌న్నుల లెగ‌సీ వేస్ట్ ను తొల‌గించామ‌ని వ‌చ్చే జూన్ నాటికి మిగిలిన 68 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను పూర్తిగా తొల‌గిస్తామ‌ని చెప్పారు. 2014-19 మ‌ధ్య‌లో రాష్ట్రంలో 10 చెత్త నుంచి విద్యుత్ త‌యారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌గా...గ‌త ప్ర‌భుత్వం కేవ‌లం విజ‌య‌వాడ‌,విశాఖ‌ప‌ట్నం మిన‌హా మిగిలిన ప్రాజెక్ట్ ల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు ప్లాంట్ల నుంచి 2800 ట‌న్నుల చెత్త‌ను విద్యుత్ గా మారుస్తున్నామ‌ని.. కాకినాడ‌,నెల్లూరు, క‌డ‌ప‌, క‌ర్నూలులో కొత్త‌గా ప్లాంట్ల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. వీటితో పాటు విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌న్నారు. ఈ ప్రాజెక్ట్ లు పూర్త‌యితే రాష్ట్రంలో ప్ర‌తిరోజూ ఉత్ప‌త్తి అయ్యే 7000 ట‌న్నుల ఘ‌న వ్య‌ర్ధాల‌లో 6500 ట‌న్నులు విద్యుత్ గా మారిపోతుంద‌న్నారు. ఈ ప్లాంట్లు పూర్త‌య్యే లోగా ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తామ‌ని చెప్పారు.

ఇక డ్రెయిన్ల విష‌యానికొస్తే రాష్ట్రం మొత్తం మీద 46,900 కిమీ మేర అవ‌స‌రం ఉండ‌గా.. 23,350 కిమీ మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. మ‌రో 23,610 కి.మీ మేర డ్రెయిన్ల నిర్మాణం చేప‌ట్టాల్సి ఉంద‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు. ఈ మొత్తంలో ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప్ర‌స్తుతం 9000 కోట్ల మేర ప‌నులు చేప‌ట‌డుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప్ర‌స్తుతం 3,245 కిమీ ఉంద‌ని,మ‌రో 2,809 కిమీ మేర ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. మ‌రో 17,556 కిమీ మేర అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ ఆ ప‌నులు చేప‌ట్ట‌డానికి 36 వేల కోట్లు అవ‌స‌రం అవుతుంద‌న్నారు. ద్ర‌వ వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ కోసం సీవ‌రేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో దేశంలోనే మొద‌టిసారిగా విశాఖ‌ప‌ట్నంలో 99,000 వీధి లైట్ల ను ఎల్ ఈడీ లైట్లుగా మార్చిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు.2014-19 మ‌ధ్య‌లో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు టిడ్కో ద్వారా 7 ల‌క్షల ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తులు తీసుకురాగా....3.8 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మాణం ప్రారంభ‌మైంది...కానీ గ‌త ప్ర‌భుత్వం ఆ సంఖ్య‌ను 2,61,000కు త‌గ్గించడ‌మే కాకుండా వాటిని కూడా పూర్తి చేయ‌కుండా మ‌ధ్య‌లో నిలిపివేసింది..ఇళ్లు నిర్మాణం ప్రారంభించిన కాంట్రాక్ట‌ర్ల‌ను ఇబ్బందిపెట్టింది..పాత కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు కూడా చెల్లించ‌లేద‌ని మంత్రి తెలిపారు...ప్ర‌స్తుతం టిడ్కో ఇళ్ల‌ను పూర్తి చేసేందుకు హ‌డ్కో ద్వారా రుణం తీసుకున్నామ‌న్నారు..టిడ్కో ఇళ్ల‌లో 365,430 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల‌ను వ‌చ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు.వ‌చ్చే ఉగాది నాటికి ల‌క్ష టిడ్కో ఇళ్ల‌ను పూర్తి చేసి ల‌బ్దిదారుల‌కు అందిస్తామ‌ని మంత్రి చెప్పారు..

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల‌ను తిరిగి పున‌రుద్దరించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు..పేద‌వాడికి కేవ‌లం ఐదు రూపాయిల‌కే క‌డుపునిండా నాణ్య‌మైన అందించాల‌నే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ల‌ను ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు...రాష్ట్రంలో ప్ర‌స్తుతం 204 అన్న క్యాంటీన్ల‌లో ప్ర‌తిరోజూ రెండు ల‌క్ష‌ల 25 వేల మంది నాణ్య‌మైన ఆహారం తీసుకుంటున్నార‌ని అన్నారు...గ‌త ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్ల‌ను ఎందుకు మూసివేసిందో అర్ధం కాలేద‌న్నారు...త్వ‌ర‌లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామ‌న్నారు. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌లో మెట్రో రైల్ ఏర్పాటు కోసం కేంద్రంతో సంప్ర‌దింపులు చేస్తున్నామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌. టీడీఆర్ బాండ్ల జారీలో దేశంలో ఎక్క‌డా లేనివిధంగా వంద‌ల కోట్ల అక్ర‌మాల‌కు గ‌త ప్ర‌భుత్వం పాల్ప‌డింద‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు..త‌ణుకు,తిరుప‌తిలో రిజిస్ట్రేష‌న్ వాల్యూకు అద‌నంగా 4 రెట్ల ధ‌ర‌తో బాండ్లు జారీ చేసార‌ని అన్నారు..త‌ణుకు లో 63.2 కోట్ల విలువ చేసే బాండ్ల‌కు 691.4 కోట్ల విలువ చూపించార‌ని....తిరుప‌తిలో 147 కోట్ల విలువ చూపించార‌ని చెప్పారు...దీంతో అక్ర‌మాలు జ‌రిగిన బాండ్లు మినహా మిగ‌తా వాటిని కొనుగోలు చేసిన వారికి జారీ చేసామ‌ని అన్నారు..ప్ర‌స్తుతం టీడీఆర్ బాండ్ల అక్ర‌మాల‌పై విజిలెన్స్ విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు.

అలాగే అమ‌రావ‌తి విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం రైతుల‌ను ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేసింద‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ఇంజినీర్ల క‌మిటీ వేసి అన్నీ క్లియ‌ర్ చేసేందుకు 8 నెల‌లు ప‌ట్టింద‌న్నారు..ప్ర‌స్తుతం 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు,1500 కిమీ మేర లే అవుట్ రోడ్లు,4026 ఇళ్లు,5 ఐకానిక్ భ‌వ‌నాలు,అసెంబ్లీ,హైకోర్టు నిర్మాణాలు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి తెలిపారు..అమ‌రావ‌తి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. మూడేళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఎంఎల్ ఏ,ఎంఎల్ సి క్వార్ట‌ర్ల నిర్మాణాల‌ను ఏప్రిల్ చివ‌రికి పూర్తి చేస్తామ‌ని మంత్రి తెలిపారు.

Next Story