రైతు పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

The government buys every seed grown by the farmer. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ నందు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా

By Medi Samrat  Published on  8 Feb 2023 8:39 AM GMT
రైతు పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

రాష్ట్రంలో ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ నందు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు. విజయవాడ రూరల్ కానూరు లోని పౌర సరఫరాల భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ను బుధవారం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత దేశంలోనే తొలి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం ఈ సెంటర్ ద్వారా తెలుస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 13 ఉమ్మడి జిల్లాల్లో కార్యకలాపాలు మానిటరింగ్ చేస్తామని మంత్రి తెలిపారు

రైతు పండించిన పంటకు సంబంధించి ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థ నందు మొబైల్ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటికి అందించే కార్యక్రమం, ఎంఎల్ఎస్ గోడౌన్ లను, రైస్ మిల్లులు, స్టేజ్ - 1, 2 రవాణా వాహనాల కదలికలను సంబంధిత వివరాలను అనుసందానం చేసి ఒకే చోటు నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మానిటరింగ్ చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. అలాగే మొబైల్ వాహనాల కదలిక, ఇంటివద్దనే బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, అంగన్ వాడి కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేయు నిత్యావసర సరుకులను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అన్ని మిల్లులలోనూ సిసి కెమెరాలను ఏర్పాటు చేసి మిల్లింగ్ చేయు కార్యకలాపాలను సిసి కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

ఈ వ్యవస్థలో గుర్తించిన లోపాలను కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నుండి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఎటువంటి అక్రమాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. సీనియర్ అధికారుల సమక్షంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తామని, ఏ చిన్న తప్పు జరగకుండా ఉండేందుకే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మానిటరింగ్ చేస్తూ ఎంఎల్ఎస్ గోడౌన్ లు, రైస్ మిల్లులు, స్టేజ్ -1, 2 రవాణా, ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు.

రైతు పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక శ్రద్ద వహించామని, చిరు ధాన్యాలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. చిరుధాన్యాల కొనుగోలు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. గోధుమపిండి పంపిణీ పైలట్ ప్రాజెక్ట్ గా ఉత్తరాంధ్రలో ప్రారంభించామని, త్వరలోనే రాష్ట్రమంతటా ప్రారంభిస్తామన్నారు. కందిపప్పు నాణ్యత లేదనే ప్రచారం అవాస్తవమని, అధికారులు స్వయంగా వండించి నాణ్యతను పరిశీలించారని, ఎక్కడా ఎటువంటి నాణ్యత లోపం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు.

Next Story