గుడ్న్యూస్..రేపే ఖాతాల్లోకి 'తల్లికి వందనం' డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
By Knakam Karthik
గుడ్న్యూస్..రేపే ఖాతాల్లోకి 'తల్లికి వందనం' డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో ముఖ్యమైన మరో హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా 'తల్లికి వందనం' పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రేపే తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 67 లక్షల మంది తల్లికి వందనం పథకం నిధులను రేపు ఖాతాల్లో జమ చేయనుంది.
కాగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 67,27,1645 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప జేయనున్నారు. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో ప్రవేశం పొందే పిల్లలు, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో విడుదల చేసింది. కాగా సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది.