తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ల్యాండ్ అయింది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు.
ప్రైవేట్ కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రులు తిరుగు ప్రయాణమయ్యేందుకు తిరిగి జనసేన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారితో కలిశారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా పంపిన, తెలుగు సంస్కృతికి ప్రతీకలైన కొండపల్లి బొమ్మల జ్ఞాపికలను తెలంగాణ మంత్రులకు బహూకరించి జనసేన నాయకులు వీడ్కోలు పలికారు.