బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదన్న టీడీపీ

TDP not to contest Badvel bypoll. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తెలుగు దేశం పార్టీ తెలిపింది. బద్వేల్ అసెంబ్లీ స్థానం

By Medi Samrat  Published on  4 Oct 2021 4:36 AM GMT
బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయడం లేదన్న టీడీపీ

బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తెలుగు దేశం పార్టీ తెలిపింది. బద్వేల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని.. ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం నాడు పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో.. బరిలో దిగేందుకు టీడీపీ ముందుకు రావడం లేదు. దీంతో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది. ఇప్పటికే జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని ప్రకటించడం తెలిసిందే.

బద్వేల్ లో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కొద్దిరోజుల కిందట మరణించారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30న పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఈ క్రమంలో టీడీపీ తొలుత తన అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. రాజశేఖర్ గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ భావించింది. గత ఆనవాయితీలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ తాజాగా బరి నుంచి తప్పుకుంది.


Next Story