టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు టీడీపీ ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. ఘటనలో శాంతిభద్రతల వైఫల్యం కనిపించిందన్నారు. దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు.
ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేదని.. టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని హోంశాఖ కార్యదర్శికి వివరించామని తెలిపారు. హోంశాఖ కార్యదర్శి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారని అన్నారు. దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామని.. ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితి వివరిస్తామని అన్నారు.