పాదయాత్రకు ముందే లోకేష్ బిజీ బిజీ..!
TDP Leader Nara Lokesh Yuvagalam Padayatra. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి
By Medi Samrat
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ ప్రత్యేక షెడ్యూల్ విడుదలైంది. 25వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.45కి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కి చేరుకుని ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అదే రోజు సాయంత్రం కడపకు చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గా సందర్శిస్తారు. కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో సాయంత్రం 6.30కి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు దేవుని గడపలో స్వామి వారిని దర్శించుకుంటారు. ఆపై రోడ్డుమార్గంలో తిరుమల చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 26వ తేదీ గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుమల నుండి బయలుదేరి మధ్యాహ్నం 2.30కి కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. 27 నుంచి యువగళం పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభిస్తారు.
ఇదిలావుంటే.. 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగనుంది.