ప్రజలు జగన్కు ఓటేస్తే.. పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారు.. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని సంతృప్తిగా ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఓటమిపాలై ఏడాది కాలేదు.. అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారన్నారు. 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు.. వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. గత ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారు.. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. 30 సంవత్సరాలు నేనే సీఎం అని భ్రమలో ఉన్నారు.. జగన్ ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా భారతిగారిని కోరుతున్నామని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు.
జగన్ మాటలకు వైసీపీ నేతలే విస్తుపోతున్నారు.. అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ గౌరవాన్ని ఇవ్వలేదన్నారు. జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి భూమి అయినా కబ్జాకు గురైందా..?.. జగన్ హయాంలో రాష్ట్రమంతా కబ్జాలేనన్నారు.
చంద్రబాబును నిద్ర లేపితే చంద్రముఖిని లేపినట్టే అని మాట్లాడుతున్న జగన్ను ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలన్నారు. జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తున్నాం.. మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయట్లేదన్నారు. జగన్ 2.0 అంటే.. 11 సీట్లు కూడా రావు అని కౌంటరిచ్చారు.