కొత్త‌గా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Swearing in of 8 newly elected MLCs. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది

By Medi Samrat  Published on  15 May 2023 9:05 AM GMT
కొత్త‌గా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు నేడు ప్రమాణం చేశారు. ఈ మేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షుడు కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు నూతన ఎంఎల్‌సీల‌ పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎంఎల్‌సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ(Meriga) మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ధర్మాన ప్రసాద రావు, సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి, మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంఎల్ఏ వరప్రసాద్, పలువురు ఎంఎల్సీలు పాల్గొన్నారు.


Next Story