ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By - అంజి |
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 2(s) ప్రకారం “పోలీస్ స్టేషన్”గా నోటిఫై చేయలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్లను రద్దు చేయడం న్యాయ విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు వైఖరిని “న్యాయానికి విరుద్ధమైనది”గా అభివర్ణించింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్లు 100 నుంచి 102 వరకు పరిశీలించింది. రాష్ట్ర విభజనకు ముందు అమల్లో ఉన్న చట్టాలు, నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉత్తర్వులు సంబంధిత అధికారం ద్వారా సవరించబడే లేదా రద్దు చేయబడే వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
2003 సెప్టెంబర్ 12న జారీ చేసిన జీఓఎంఎస్ నం.268 ద్వారా ఏసీబీ కార్యాలయాలను పోలీస్ స్టేషన్లుగా ప్రకటిస్తూ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ జాయింట్ డైరెక్టర్కు రాష్ట్రవ్యాప్త అధికార పరిధి కల్పించిన విషయం రాష్ట్ర విభజన తర్వాత కూడా చెల్లుబాటు అవుతుందని కోర్టు తేల్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఎలాంటి న్యాయ శూన్యత ఏర్పడలేదని స్పష్టం చేసింది.
ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ హైదరాబాద్ నుంచి విజయవాడకు మారినంత మాత్రాన దాని అధికార పరిధి కోల్పోలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2014 చట్టంలోని డీమింగ్ నిబంధనలు, అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్ల నేపథ్యంలో కొత్తగా నోటిఫికేషన్ అవసరం లేదని పేర్కొంది.
2022 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీఓఎంఎస్ నం.137 కేవలం వివరణాత్మక ఉత్తర్వు మాత్రమేనని, దీనికి పూర్వాపర ప్రభావం లేదని కోర్టు స్పష్టం చేసింది. అవినీతి నిరోధక దర్యాప్తుల వంటి అంశాల్లో కోర్టులు ఆచరణాత్మక, ఉద్దేశ్యపూర్వక దృక్పథంతో చట్టాన్ని విశ్లేషించాలని సూచించింది.
హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం కోర్టు, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను పునరుద్ధరించింది. దర్యాప్తు కొనసాగించేందుకు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులపై బలవంత చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. దర్యాప్తు అనంతరం ఇతర చట్టబద్ధ కారణాలను ప్రస్తావించుకునే స్వేచ్ఛ నిందితులకు ఇచ్చింది. ఇకపై ఈ ఎఫ్ఐఆర్లు లేదా పెండింగ్ దర్యాప్తులపై హైకోర్టు మరిన్ని సవాళ్లను స్వీకరించరాదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.