పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By - Medi Samrat |
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు, సీఎస్ విజయానంద్, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి
సత్యసాయిబాబా మహాసమాధి దర్శన నిమిత్తం పుట్టపర్తి నిలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే వాహనాలకు పార్కింగ్తో పాటు పట్టణంలో రాకపోకల ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. బాబా మహాసమాధి దర్శనానికి ఎంత మంది భక్తులు రావచ్చనేదానిపై అంచనా వేసి అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ముందుస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పుట్టపర్తిలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
10 రోజులు 682 రైళ్లు
పుట్టపర్తికి వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు 250 మంది సిబ్బంది, వచ్చే భక్తులకు తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. జయంతి వేడుకల నేపథ్యంలో 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుతోందని వివరించారు. పుట్టపర్తి బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కు రోజుకు 20 బస్సులు భక్తుల రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్, అధికారులు పాల్గొన్నారు.