ఏలూరు వింత వ్యాధి.. భీమడోలులో కలకలం..!

Strange Disease In Bhimadole. గత నెల ఒక వారం రోజుల పాటు ఏలూరును గడగడలాడించిన వింత వ్యాధి

By Medi Samrat  Published on  19 Jan 2021 2:36 PM GMT
ఏలూరు వింత వ్యాధి.. భీమడోలులో కలకలం..!

గత నెల ఒక వారం రోజుల పాటు ఏలూరును గడగడలాడించిన వింత వ్యాధి ప్రస్తుతం భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరులో వ్యాపించిన ఈ వింత వ్యాధి బారిన దాదాపు 615 మంది పడ్డారు. ఇందులో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాపించిందనే విషయం పూర్తిగా నిర్ధారణ కాకముందే, అదే లక్షణాలతో తాజాగా పూళ్ళ గ్రామంలో ఇద్దరికీ అవే లక్షణాలు కనిపించడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మందులు తీసుకున్నారు.

పండుగ సమయంలో కొద్దిగా అలసట, తీసుకున్న ఆహారం కారణంగా ఇలాంటి పరిణామం చోటు చేసుకొని ఉండవచ్చనని అధికారులు భావించారు.అయితే క్రమక్రమంగా ఇలాంటి లక్షణాలు ఎక్కువమందిలో కనిపించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వారందరికీ బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించారు.ఆ గ్రామంలో తాగునీటిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. ఈ వింత వ్యాధి ప్రభావం పెరుగుతుండడంతో సోమవారం రాత్రి డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.సునంద పూళ్ల పీహెచ్‌సీకి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ గ్రామానికి చెందిన తాగు నీటికి సంబంధించి క్లోరినేషన్‌ ప్రక్రియను మెరుగు పరచాలని, ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ వింత వ్యాధి వల్ల ఎవరు భయపడవద్దని. అన్ని రకాల అత్యవసర సేవలను అందుబాటులో ఉంచామని,15 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. వ్యాధి అదుపులోనే ఉంది అవసరమైతే రక్తపరీక్షల నమూనాలను కూడా సేకరిస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ విధమైన లక్షణాలతో ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకున్న మాంసాహార పదార్థాలే కారణమా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.




Next Story