కడపలో స్టీల్ ప్లాంట్‌ సహా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

SIPB green signal for investments totaling Rs 23,985 crore. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం అయ్యింది.

By Medi Samrat  Published on  12 Dec 2022 11:10 AM GMT
కడపలో స్టీల్ ప్లాంట్‌ సహా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం అయ్యింది. ఈ స‌మావేశంలో కడప జిల్లాలో రూ. 8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. త‌ద్వారా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. రెండు విడతల్లో మొత్తంగా రూ. 8,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్ట‌నుంది. మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు. మొత్తంగా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులు చేసే విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని సీఎం అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని సీఎం అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని.. తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం ఆశాభావం వ్య‌క్తం చేశారు.

1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ వ‌ల్ల ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి ల‌భించ‌నుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టులు చేప‌ట్ట‌నుంది. 2024 డిసెంబర్లో ప్రారంభించి.. నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని.. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలిపారు. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంది.


Next Story