ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి సమయం వచ్చేసింది
Schools Starts From 16th August In AP. సెకండ్ వేవ్ కారణంగా స్కూళ్ళు మూత పడిన సంగతి తెలిసిందే..! ఇక విద్యా సంవత్సరం
By Medi Samrat
సెకండ్ వేవ్ కారణంగా స్కూళ్ళు మూత పడిన సంగతి తెలిసిందే..! ఇక విద్యా సంవత్సరం ప్రారంభమవుతూ ఉండడంతో పాఠశాలలను తెరవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగష్టు 16 నుంచి స్కూల్స్ తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని అన్నారు. ఆగష్టులోపు విద్యాసంస్థల్లో పెండింగ్ ఉన్న 'నాడు నేడు' పనులను పూర్తి చేయాలని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు.
10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని అన్నారు. ఈ నెలాఖరులోపు మార్క్స్ మెమోలను జారీ చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయనుంది. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదని, ఏ ఉపాద్యాయ పోస్టు కూడా తగ్గదని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తవుతుందన్నారు.
ఏపీలో విద్యాసంవత్సరాన్ని జూన్ 12 నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ తరగతుల్ని ఆగస్టు 14 వరకూ కొనసాగిస్తారు. ఆగస్టు 15 వేడుకల తర్వాత ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.