'శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం' ప్రారంభించిన జగన్
Saswatha Bhu Hakku Bhoo Raksha Pathakam. ఆంధ్రప్రదేశ్లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. భూ వివాదాలకు శాశ్వతంగా
By Medi Samrat Published on 21 Dec 2020 7:43 AM GMTఆంధ్రప్రదేశ్లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం' పేరుతో భూముల సమగ్ర రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వే కోసం వినియోగించే పరికరాలను, వాటి ఫలితాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రెవన్యూ, సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టి 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని జగన్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. తొలి దశలో 5,122 గ్రామాల్లో సర్వే చేపడతారు. రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే జరుగుతుంది. చివరి దశలో మిగిలిన గ్రామాల్లో ఈ సర్వే జరుపుతారు. దీని ద్వారా దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులను ప్రతి ఇంచు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించనున్నారు. అనంతరం రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరచనున్నారు. రాష్ట్రంలో 1920-27 మధ్యలో భూముల సర్వే జరిగింది. వందేళ్ల తర్వాత మళ్లీ భూముల సమగ్ర సర్వేకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
రేపటి నుంచి ఏపీలోని ప్రతి జిల్లాలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. రీ సర్వే జరిగే గ్రామాల్లో జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి.. సర్వే ఎప్పుడు జరుగుతుందన్న వివరాలను తేదీలను వెల్లడిస్తారు. ఈ సర్వేలో కొలతలు ఖచ్చితంగా ఉంటాయని, తేడా చాలా సూక్ష్మ స్థాయిలో రెండు సెంటీమీటర్లకు అటు ఇటు మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.