ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది.
By - Medi Samrat |
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు దావోస్ లో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖనగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్లో సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో GCC పార్క్ను అభివృద్ధి చేయడానికి RMZ గ్రూప్ అంగీకరించింది. దావోస్లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మిక్స్ డ్ యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే, విశాఖపట్నాన్ని నెక్ట్స్ జెన్ మిక్స్డ్ యూజ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఆర్ఎంజడ్ ఈ పెట్టుబడులు పెట్టనుంది.
విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా 1 గిగావాట్ వరకు లక్ష్య సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఆర్ఎంజడ్ గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరం. ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ జెన్ డిజిటల్, ఏఐ వర్క్ లోడ్ కు మద్దతు ఇస్తుంది. స్థిరత్వం, గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్ కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇదిలావుండగా రాయలసీమలో టేకులోడు వద్ద RMZ గ్రూప్ సుమారు 1,000 ఎకరాలలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటిపై కలిపి రాబోయే ఐదేళ్లలో ఆర్ఎంజడ్ సంస్థ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనుంది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. సింగిల్ విండో విధానం ద్వారా కాలపరిమితులతో కూడిన అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ ప్రభుత్వం తమ కమిట్ మెంట్ ను మరోసారి స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం అనుసరిసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.