ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం.. రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు
By - Medi Samrat |
విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకుంది రెన్యూ పవర్ సంస్థ. ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలు కుదుర్చుకున్నారు రెన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు. ఇవి కాకుండా.. గతంలోనే రూ. 22 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతుంది.
ఒప్పందంలో భాగంగా 6 GW PV ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 GW హైబ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రెన్యూ పవర్. తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభించనుంది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రెన్యూ పవర్ అంగీకారం తెలిపింది.