వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik
వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ పార్క్ వర్క్ షాపులో స్టార్టప్ కంపెనీల ఎగ్జిబిషన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో మన దేశీలయులదే కీలక పాత్ర అని చెప్పారు. ఏఐ, డీప్ టెక్నాలజీదే భవిష్యత్తు అని చెప్పారు. జనవరి 1 తర్వాత అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 తర్వాత వాట్సాప్ ద్వారానే అన్ని ప్రభుత్వ సర్వీసులు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనాన్ని కేవలం ఐటీ మాత్రమే తేగలదని విశ్వసించాను. గతంలో హైదరాబాద్లో ఐటీ సంస్థలను ప్రోత్సహించేందుకు హైటెక్ సిటీని నిర్మించాం. ఒక ఎకో సిస్టంను ఏర్పాటు చేయటం వల్లే ఇప్పుడు సైబరాబాద్ ప్రపంచానికి ఐటీ కేంద్రంగా మారింది. ఇంగ్లీష్, గణితం లాంటి కీలకమైన సబ్జెక్టుల్లో తెలుగు వారి నైపుణ్యాన్ని గుర్తించే ఇంజనీరింగ్ కళాశాలలను కూడా పెద్ద ఎత్తున స్థాపించాం. వీటితో పాటే ఐటీ కోర్సులను, సంస్థలను కూడా విస్తృతంగా ప్రోత్సహించాం. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ఆదాయంలో 75 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. ఐటీ సెక్టార్ తో పాటు వేర్వేరు రంగాల్లో తెలుగు వారే కీలకంగా ఉన్నారు. కేవలం ఈ 25 ఏళ్లలోనే ఈ మార్పులన్నీ వచ్చాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మానవాళి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం మిళితం అయిపోయింది. ఆర్ధిక సంస్కరణలు, సాంకేతిక సంస్కరణలు భారత ముఖ చిత్రాన్ని మార్చేశాయి. అందులో నేను కూడా కీలక భాగస్వామిని కావటం నా అదృష్టం. గతంలో లైటెనింగ్ కాల్ చేయాలన్నా 7 రోజులు పట్టేది. అలాంటి సవాళ్లన్నీ దాటుకుని ఆధునిక సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగస్వామిగా మారింది. యంగ్ ఇండియా మన దేశానికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. క్వాంటం వ్యాలీ డీప్ టెక్నాలజీ ఇప్పుడు సరికొత్త విప్లవం..అని సీఎం పేర్కొన్నారు.