వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి. '2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని' అంటూ రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్లకార్డును ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పోలీసులు సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేయడం పై స్పందించిన వైఎస్ జగన్ అది సినిమా డైలాగ్ అని సమర్ధించారు. పుష్ప సినిమాలోని డైలాగ్ అని మీడియాతో వెల్లడించారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించేవారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.