భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి 65 కిలోమీట‌ర్లు న‌డిచిన నిండు గర్భిణి

Pregnant woman walks about 65 km and delivers baby after dispute with husband in Naidupet. తిరుపతి జిల్లా నాయుడుపేటలో భర్తతో గొడవపడి గర్భిణి రెండు రోజుల పాటు 65 కిలోమీటర్లు నడిచి వెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  15 May 2022 1:19 PM GMT
భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి 65 కిలోమీట‌ర్లు న‌డిచిన నిండు గర్భిణి

తిరుపతి జిల్లా నాయుడుపేటలో భర్తతో గొడవపడి గర్భిణి రెండు రోజుల పాటు 65 కిలోమీటర్లు నడిచి వెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన వర్షిణి ఉపాధి నిమిత్తం భర్తతో కలిసి తిరుపతికి వచ్చింది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో వర్షిణి గర్భం దాల్చి.. నెలలు గడుస్తున్న కొద్దీ ఇద్ద‌రి మ‌ధ్య‌ గొడవలు పెరిగి తారాస్థాయికి చేరాయి.

భర్తతో గొడవ పడడంతో వర్షిణి కాలినడకన ఇంటి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అయితే నాయుడుపేటకు చేరుకున్న త‌ర్వాత‌ ఆమె ముందుకు వెళ్లలేకపోయింది. ఆమె దీనస్థితిని చూసిన ఓ వ్యక్తి 108కి ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి చూడగా వర్షిణి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె అంబులెన్స్‌లో బిడ్డ‌కు ప్రసవించింది. వర్షిణి 2 రోజులుగా భోజనం చేయకపోవడంతో వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.

నిండు గర్భంతో 65 కిలోమీటర్లు నడిచి వచ్చిన వర్షిణిని చూసి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు. వర్షిణి పరిస్థితి గురించి తెలుసుకున్న దిశ పోలీసులు ఆమె చికిత్స పొందుతున్న స్థలానికి చేరుకుని, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశారు.















Next Story