15 ని.లు రోడ్ షో.. గంట బహిరంగ సభ.. మోడీ అమరావతి షెడ్యూల్ ఫిక్స్

ప్ర‌ధాని మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది.

By Knakam Karthik
Published on : 27 April 2025 4:16 PM IST

Andrapradesh, Amaravati, Pm Modi, Schedule Fix, Road Show

15 ని.లు రోడ్ షో,..గంట బహిరంగ సభ..మోడీ అమరావతి షెడ్యూల్ ఫిక్స్

ప్ర‌ధాని మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది.మే 2న మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం విమాన‌శ్ర‌యానికి ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ప్ర‌ధానికి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్, సీఎం చంద్ర‌బాబు,డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,కేంద్ర‌మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఘ‌నంగా స్వాగతం ప‌ల‌క‌నున్నారు. రూ.ల‌క్ష కోట్ల అమ‌రావ‌తి ప‌నుల‌ను ప్రధాని పున‌ర్ ప్రారంభించ‌నున్నారు. కాగా ప్ర‌ధాని స‌భను సుమారు 5 ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇదే ప్రధాని టూర్ షెడ్యూల్..

అమరావతి పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోడీ రాష్ట్ర సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి సభా వేదిక వద్దకు 1.1 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ దాదాపు 15 నిమిషాలు ఉంటుంది. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను ప్రధాని మోడీ సందర్శిస్తారు. 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.

కాగా గ‌త శుక్ర‌వారం ఢిల్లీలో ప్ర‌ధానిని సీఎం చంద్ర‌బాబు నేరుగా క‌లిసి అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌నకు రావాల‌ని అహ్వాన ప‌త్రిక‌ను అందించారు. ఈ నేప‌ధ్యంలో ప్ర‌ధాని రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తిలో జ‌రిగే ప్ర‌ధాని మోడీ తొలి అధికారిక ప‌ర్య‌ట‌న కావ‌డంతో భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌ధాని సభా ఏర్పాటు కోసం ప్ర‌త్యేకంగా ఆరుగురు మంత్రుల‌తో పాటు, కీల‌క అధికారుల‌తో వేరు వేరుగా ప్ర‌త్యేక క‌మిటీలు ఏర్పాటు చేశారు.

Next Story