పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా.. పేర్ని నాని సెటైర్లు

Perni Nani's satirical comments on the postponement of Pawan Kalyan's bus trip.

By అంజి  Published on  19 Sep 2022 5:56 AM GMT
పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా.. పేర్ని నాని సెటైర్లు

జనసేనాని పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడానికి బస్సు యాత్ర చేయాలని సంకల్పించారు. ఆయన అక్టోబరు 5న బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. ఆ నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ మార్చుకున్నారు. అక్టోబరులో తలపెట్టిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కౌలు రైతుల భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. మంగళగిరి కార్యాలయంలో జనసేన లీగల్ సెల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయంలో వచ్చిన మార్పును వెల్లడించారు. ఇక, 2014లో తానేమీ టీడీపీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో కాకుండా చిన్నస్థాయి రాజధాని ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు. రాజధానిపై అసెంబ్లీలో ఇచ్చిన మాటను వైసీపీ తప్పిందని ఆరోపించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 స్థానాలే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కల్యాణ్ బస్సు యాత్రను వాయిదా వేసుకోవడంతో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. "దసరాకు వస్తాను... మీ సంగతి చూస్తాను" అన్న పవన్ నాయుడు ఇప్పుడెక్కడున్నాడు అంటూ ప్రశ్నించారు. పవన్ కనీసం దసరాకు పులి వేషం వేసుకొచ్చినా బాగుండేదని అన్నారు.బస్సు యాత్రకు తూచ్ అంట. పొద్దునేమో లోకేశ్ నాయుడు తూచ్ అన్నాడు, మధ్యాహ్నానికి పవన్ నాయుడు తూచ్ అన్నాడు. ఇద్దరి యాత్రలు క్యాన్సిల్. ఇద్దరి యాత్రలకు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వాలి కదా అని అన్నారు. పవన్ బస్సు యాత్ర ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు...షూటింగులు ఏమైనా ఉన్నాయా? అడ్వాన్సులు ఇచ్చే ప్రొడ్యూసర్లకు ఆయాసం వస్తోందేమో కానీ, మనం ఆయాసం లేకుండా అడ్వాన్సులు తెగ తీసుకుంటున్నాం కదా! నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు అడ్వాన్సులు తీసుకున్న సినిమాలు పూర్తవ్వాలంటే 2050 వరకు ఆగాల్సిందేనని విమర్శించారు. ఇప్పుడు ఎవరో ఒకరిని ముంచాల్సిందే... జెండా మోసిన కార్యకర్తనో, డబ్బులిచ్చిన నిర్మాతలతోనో, దర్శకులనో ముంచాలి. పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని అన్నారు.

Next Story