ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో గొప్ప బాధ్యతను అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మచిలీపట్నంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునూ అందుకుని, కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన తాను, ముందుగా కార్యకర్తలతో సమావేశం కావడానికే ప్రాధాన్యత ఇచ్చానని, ఇకపై నాయకులందరూ నియోజకవర్గ పర్యటనల్లో తొలుత కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు.
చంద్రబాబు నాయుడిది సాధారణమైన మొండి ధైర్యం కాదని, 1996లో రాజమండ్రి సెంట్రల్ జైలును ఆధునీకరించిన ఆయన్నే, 2014-19 మధ్య ఆయన కట్టించిన బ్లాక్లోనే అక్రమంగా నిర్బంధించారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారని, అయితే పార్టీ నాయకులు కష్టకాలాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదని హితవు పలికారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా వ్యవహరించాలి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందామని, అంతర్గతంగా పోరాడాలన్నారు నారా లోకేష్.