ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఏపీకి రావాలంటే.. భయమేస్తుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు.
ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. శ్రీదేవి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏంటీ ఉండవల్లి శ్రీదేవి నిన్ను హత్య చేస్తారేమోనని భయపడి కనిపించకుండాపోయి.. ఈరోజు ప్రెస్మీట్ పెడుతున్నావా? తాను టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను.. తానే చంపుకునే అలవాటు సీఎం జగన్కు లేదమ్మా? అలాగే నీలా అమ్ముడుపోయే వారి గురించి ఆలోచించే అలవాటు కూడా లేదు' అని నందిగం సురేష్ ట్వీట్ చేశారు.
ఇక మంత్రి రోజా కూడా తాజా పరిణామాలపై స్పందించారు. మంత్రి రోజా మాట్లాడుతూ సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని, ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు చాలా హంగామా చేస్తున్నారని విమర్శించారు. వైనాట్ పులివెందుల అంటున్నారని, పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరని రోజా అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ ఉన్నారని, 175 సీట్లకు 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ గెలిచారని విమర్శించారు.