ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంపీ మార్గాని భరత్ కారులో లేరు..!

MP Bharat Car Accident Case. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యుల కారు ఢీకొని ఓ వృద్ధుడు మరణించడం కలకలం రేపింది.

By Medi Samrat
Published on : 13 May 2023 8:30 AM IST

ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంపీ మార్గాని భరత్ కారులో లేరు..!

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కుటుంబ సభ్యుల కారు ఢీకొని ఓ వృద్ధుడు మరణించడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని భీమడోలుకు చెందిన రిటైర్డ్ పశు వైద్యుడు శృంగవృక్షం నరసయ్య (65)గా గుర్తించారు. మార్గానికి భరత్ కుటుంబ సభ్యుల కారు నల్లజర్ల వైపు నుంచి విజయవాడవైపు వెళ్తుండగా సీతంపేట సమీపంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళుతున్న నరసయ్యను కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరసయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో ఎంపీ కారులో లేరని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్ లో ఉంచారు.


Next Story