రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం సీజ్

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు.

By Medi Samrat  Published on  11 April 2024 1:45 PM GMT
రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం సీజ్

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించి జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ముందుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు వైపు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను, అనంతరం సింగరాయకొండ మండల పరిధిలోని పాత సింగరాయకొండ వద్ద నెల్లూరు వైపు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రయాణించే వాహనాలను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. ఈ మార్గంలో వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్న తీరు, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానంపై చెక్ పోస్ట్లోని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, ఇందుకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల దృష్ట్యా అనుమానాస్పద వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మహిళా ప్రయాణీకుల బ్యాగులను ఖచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాల్సి ఉంటుందన్నారు. తగిన ఆధారాలు లేకుండా రూ.50,000/- ల కంటే ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేసి, ట్రెజరీలో జమ చేయాలని అధికారులకు చెప్పారు. జిల్లాలోని చెక్ పోస్టులు పనిచేస్తున్న తీరుపై ఈ సందర్భంగా సి.ఈ.ఓ. సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్.పి.లు, కమాండ్ కంట్రోల్ రూములు, జిల్లాలోని పరిస్థితులు, చెక్ పోస్టుల పనితీరును పరిశీలించి అవసరమైన సూచనలు చేయడానికి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రెండు రోజుల పాటు తాను పర్యటిస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

Next Story