ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Medi Samrat  Published on  18 April 2024 1:42 PM GMT
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని, అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం జులై 24కి వాయిదా వేసింది. కేసు ప్రారంభం కాగానే విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు కోరడంతో కేసు విచారణ జూలై 24కి కోర్టు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదా ఇచ్చే అవకాశం ఉండదని కోర్టు చెప్పిందని తెలిపారు. కేసు ముందుకు సాగకుండా ఏడేళ్ల నుంచి రకరకాల కారణాలతో సాగదీస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని అన్నారు. ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరఫున న్యాయవాది కోరగా, సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరారు.

Next Story