పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు
By - Medi Samrat |
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. తమ నియోజకవర్గ గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై మంత్రులు డిప్యూటీ సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రోడ్లతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని.. ఆ రోడ్లు ఇప్పుడు బాగుపడతాయని, ప్రజల తరపున తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రులు డిప్యూటీ సీఎంకు చెప్పారు.
పవన్ కళ్యాణ్ను కలిసిన వారిలో పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, సవిత, డి వి బి స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఉన్నారు.
మొదటి విడతగా పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణలకు నిధులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే జీవో జారీ చేసింది. మొత్తంగా 157 నియోజకవర్గాల్లో 1,299 రోడ్ల పటిష్టత చేపట్టనుంది పంచాయతీ రాజ్ శాఖ. ఈ క్రమంలోనే రూ. 2123 కోట్ల మేర సాస్కీ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాల పరిధిలోని 157 నియోజకవర్గాల్లోని 4,007 కిలో మీటర్ల మేర రోడ్లను పటిష్టపరిచేలా మొదటి విడతలో కార్యాచరణ రూపొందించారు. పల్లె పండుగ 2.0 పేరిట చేపట్టే రహదారి నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి ఇటీవలే శంకుస్థాపన చేయడం గమనార్హం.