మాదకద్రవ్యాలు అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు
Minister Vellampalli Srinivas Fires On TDP. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు నుంచి చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె వరకూ రాష్ట్రవ్యాప్తంగా
By Medi Samrat Published on 22 Sep 2021 5:06 PM GMT
ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు నుంచి చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. వైసీపీకే ప్రజలు ఏకపక్షంగా పట్టం కడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇది చూసి ఓర్వలేక నిన్నటివరకు కులాలు, మతాలు, రథాల పేరుతో చిచ్చు పెట్టిన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు మాదక ద్రవ్యాల అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మొదట దేవుణ్ని, దేవుడి విగ్రహాన్ని, మతాన్ని ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టాలనుకున్నారు.. కుదరలేదు. అయినా ప్రజలు జగన్కి ఓటేశారు. ఆ తర్వాత కులాలను టార్గెట్ చేశారు. అయినా ప్రజలు జగన్కి ఓటేశారు. రామతీర్థం నుంచి తిరుపతి వరకు రాజకీయాలు చేశారు. కోర్టులకు వెళ్లారు. తిరుపతి ఎన్నికల సందర్భంలో అయితే మరీ దిగజారి పుకార్లు దుష్ప్రచారం చేశారు. అయినా ప్రజలు జగన్కి ఓటేశారు.
కాబట్టి ఇప్పుడు రూ.72 వేల కోట్ల రూపాయల హెరాయిన్ రవాణాకు విజయవాడ కేంద్రం అయిందంటూ తప్పుడు కథనాలను వండి వార్చి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు వివరణ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నుంచి బొండా ఉమ వరకు ప్రతి ఒక్కరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.