నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్
కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు.
By - Medi Samrat |
కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చింది. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చేనేత బజార్లు నిర్వహిస్తోంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది.
ఈ క్రమంలోనే 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 11,488 మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తోంది. 50 ఏళ్లు నిండిన 92,724 మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కోకు వస్త్రాలు విక్రయించే నేతన్నలకు అయిదు శాతం జీఎస్టీ మినహాయిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల తయారీలో శిక్షణిస్తూ, ఉత్పత్తులను ఆప్కో, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. కేవలం 15 నెలల కాలంలో నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా, గౌరవప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
రూ.2 కోట్లకుపైగా బకాయిల చెల్లింపు
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కార్యక్రమాలు చేపడుతూనే, ఆప్కో ద్వారా బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 84 చేనేత సొసైటీల నుంచి ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేస్తుంటుంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసే వస్త్రాలను ఆప్కో షోరూమ్ లు, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిలను చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలకనుగుణంగా మొదటి విడతగా ఆప్కో అధికారులు రూ.2,00,32,615.41లను శుక్రవారం విడుదల చేశారు. ఈ నిధులు ఆయా చేనేత సొసైటీల ఖాతాల్లో జమకానున్నాయి.
మొదటి విడత బకాయిల చెల్లింపులు ఇలా...
రాష్ట్రంలో ఏడు డివిజన్లలో 84 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు మొదటి విడతగా రూ.2,00,32,615.41ల బకాయిలు చెల్లించారు. శ్రీకాకుళం డివిజన్లలో ఉన్న నాలుగు సొసైటీలకు రూ.7,57,142లు, విజయనగరం డివిజన్లలో ఉన్న ఏడు సొసైటీలకు రూ.3,44,007ల బకాయిలు విడుదల చేశారు. రాజమండ్రి డివిజన్లో 27 సొసైటీలకు రూ.61,07,690లు, విజయవాడ డివిజన్లో ఉన్న 21 సొసైటీలకు రూ.48,29,780లు చెల్లించారు. తిరుపతి డివిజన్లో ఉన్న 17 సొసైటీలకు రూ.36,64,628లు, కడప డివిజన్లో ఉన్న 5 డివిజన్లకు రూ.40,30,894లు బకాయిలు విడుదల చేశారు. కర్నూలు డివిజన్ లో ఉన్న ఏడు సొసైటీలకు రూ.2,98,472ల మొదటి విడత బకాయిలు చెల్లించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని వెల్లడించారు.