అమరావతిలో రెండో విడత భూసేకరణ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నారాయణ. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్నయించారని.. దానికోసం భూమి అవసరం ఉందన్నారు.
By Medi Samrat
అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నారాయణ. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్నయించారని.. దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు.. రాజధానిలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ పరిశీలించారు.. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు... మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నారని మంత్రి తెలిపారు.. అందుకే అంతర్జాతీయ స్థాయి విమనాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని.. అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారని అన్నారు..భూసమీకరణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు. వీటిలో రైతులకు రిటర్నబుట్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌళిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు.. ఇవన్నీ పోగా ఇంకా ఐదువేల ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు.. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.. అయినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విషయంలో భూసమీకరణ లేదా భూసేకరణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణం కోసం 2015లో కేవలం 58 రోజుల్లోనే రైతులు స్వచ్చందంగా 34 వేల ఎకరాలు భూమిని పూలింగ్ ద్వారా ఇచ్చారనే విషయాన్ని మంత్రి గుర్తు చేసారు.
గత ప్రభుత్వ నిర్ణయంతోనే అమరావతి నిర్మాణ పనులు ఆలస్యం
గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు..పనులు మధ్యలో నిలిపివేసిన నాటి ప్రభుత్వం.. అప్పటి టెండర్లను కూడా రద్దు చేయకపోవడంతో న్యాయ సమస్యలు రాకుండా వాటినన్నింటిని పరిష్కరించాల్సి వచ్చింది...దీనికోసం 8 నెలల సమయం పట్టిందన్నారు..అయితే ప్రస్తుతం రాజధానిలో పనులు ప్రారంభమయినట్లు మంత్రి తెలిపారు...మొత్తం 68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి...ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి...నిర్మాణానికి సంబంధించి అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించిందన్నారు మంత్రి నారాయణ.. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయేకు కేటాయించారని.. అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని అన్నారు.. అయితే డ్రోన్ సర్వే ద్వారా ఎంత లోతు వరకూ తవ్వారనే దానిపై స్పష్టత తీసుకుంటామన్నారు.. ఇక్కడ ఖాళీగా ఉన్న భూమిని కూడా ఏదొక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామన్నారు...
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయన్నారు మంత్రి నారాయణ...ఒక నిర్ధిష్ట కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు...ఏడాదిలో అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామన్నారు...ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు,రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు,మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.