నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
By - Medi Samrat |
జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం పరాభవ నామ ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పట్ల మంత్రి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని.. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు యువతకు కల్పించామన్నారు. ఇందులో డీఎస్సీలో 30,607 - ఎంఎస్ఎంఈల నుంచి 2,48,906, జాబ్ ఫెయిర్, స్కిల్ డవలప్మెంట్ ద్వారా 1,46,627, పరిశ్రమల రంగంలో 95,174, ఫుడ్ ప్రాసెసింగ్లో 64,035, ఐటీ & ఎలక్ట్రానిక్స్లో 13,866, పర్యాటక రంగంలో 5208 ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. అలాగే మరో రు. 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఇప్పుడు మరోసారి డీఎస్సీతో పాటు 3 వేల జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం ఖాళీలు కేటాయించడం ముదావాహమన్నారు. ఉన్నత విద్య బలోపేతం కోసం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1500 అధ్యాపక పోస్టులు సైతం భర్తీ చేస్తుందని.. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 600 పోస్టులతో పాటు 1000 కానిస్టేబుల్స్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తుండడం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరం అని మంత్రి తెలిపారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నియామక ప్రక్రియ ముగిసే వరకు స్పష్టంగా తేదీలు పేర్కొనడంతో పరీక్షలకు సిద్ధమయ్యే వారు పక్కా ప్రణాళికతో తమ ప్రిపరేషన్ కొనసాగించుకునే వీలుందన్నారు.
గత ప్రభుత్వంలో యువత భవిష్యత్ నాశనం :
గత వైసీపీ ప్రభుత్వంలో యేటా 2.30 లక్షల ఉద్యోగాలతో ప్రతి యేటా జ్యాబ్ క్యాలెండర్ అన్న జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని మంత్రి శ్రీనివాస్ విమర్శించారు. జగన్ పాలనలో కమీషన్ల కోసం ఉన్న కంపెనీలకు రాష్ట్రం నుంచి తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేశారని మంత్రి మండిపడ్డారు. జగన్ పాలనలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని... ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం నాడు రాష్ట్రంలో ఉపాధి లేక 4100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ఇంతకంటే దారుణమైన పాలన ఉంటుందా ? అని మంత్రి కొండపల్లి జగన్ పాలనను దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో విద్యార్థి, యువతకు అన్ని విధాలా అండగా ఉంటే... జగన్ రెడ్డి మాత్రం తన అవినీతి, అరాచక పాలనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి.. వారి భవిష్యత్ను నాశనం చేశారని మంత్రి శ్రీనివాస్ విమర్శించారు.