రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్..! 26 జిల్లాలోయ్..!!

Minister Gudivada Amarnath Fire On Chandrababu. అమరావతి పాదయాత్ర.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు, దేవుడు పేరుతో

By Medi Samrat  Published on  13 Sep 2022 2:30 PM GMT
రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్..! 26 జిల్లాలోయ్..!!

అమరావతి పాదయాత్ర.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు, దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని, చంద్రబాబు సృష్టించిన అమరావతి దెయ్యాల రాజధాని అని.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన మరోసారి హెచ్చరించారు. యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది కదా అని ఏదైనా చేస్తాం.. ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతూ వస్తే చూస్తూ సహించబోమని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన వికేంద్రీకరణ చేస్తోందని ఆయన చెప్పారు. యాత్రకు సంఘీభావం తెలిపిన వారిలో రేణుకాచౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు చలసాని శ్రీనివాస్ , పాతూరి నాగభూషణం, కామినేని శ్రీనివాస్ వంటి వారు ఉన్నారంటే, ఇదే విషయాన్ని టీడీపీ గెజిట్ పత్రిక ఈనాడులో రాశారంటే.. ఈ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారన్నది అర్థమవుతోందని అన్నారు. కేవలం పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈ యాత్ర సాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. 2018 ఫిబ్రవరి 23న బీజేపీ చేసిన రాయలసీమ డిక్లరేషన్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొన లేదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ యాత్రకు కర్త-కర్మ-క్రియ చంద్రబాబు నాయుడే అన్నారు. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు వీరంతా ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదని అమర్నాథ్ సందేహం వ్యక్తం చేశారు.

మా ప్రాంతానికి వచ్చి, మేము కొలిచే అరసవల్లిలో దేవుడ్ని మొక్కి మాకు కీడు జరగాలని, ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని మీరు కోరతారా.. ? అటువంటి సంకల్పంతో చేస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరూ సహించబోమని ఆయన చెప్పారు. తమకు అన్యాయం జరుగుతుందని భావించిన ఉత్తరాంధ్ర వాసులు ఈ యాత్ర పై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అందుకోసమే మూడు రాజధానులు నిర్మాణం చేపట్టామని అమర్నాథ్ స్పష్టం చేశారు.

44 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని ఆయన ప్రశ్నించారు. 1983 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు అండగా నిలిచారని, అటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ద్రోహం చేయాలని భావిస్తున్నారు అని అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి మిగిలిన పార్టీలు చేస్తున్న కుట్రలను కూడా ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

అమరావతి ప్రాంతంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, భూములు ద్వారా చంద్రబాబు సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలను పదిలంగా ఉంచుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతోందని ఆయన అన్నారు.

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ చెప్పారు.. రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్.. రాష్ట్రమంటే 26 జిల్లాలోయ్ అని చంద్రబాబు నాయుడు గుర్తెరగాలి అని అమర్నాథ్ హితవు పలికారు. 2024 తో రాజధాని అంశానికి ముగింపు పడుతుందని, అప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలలో రెఫరెండమ్ అవుతాయని, ఆ ఎన్నికల్లో తీర్పు వైసీసీకి అనుకూలంగా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పరిపాలనా భవనాలు నిర్మిస్తున్నారని ఒక పత్రికలో వచ్చిన కథనం పై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదా? అని ప్రశ్నించారు.


Next Story