భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అల‌ర్ట్ చేసిన సీఎం చంద్ర‌బాబు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

By Medi Samrat  Published on  14 Oct 2024 6:26 AM GMT
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులను అల‌ర్ట్ చేసిన సీఎం చంద్ర‌బాబు

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సిఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయ్యింది.

ఈ మేర‌కు టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.. పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని ఆదేశించారు. చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని సూచించారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలని.. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు

ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు వివరించిన.. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని సీఎంకు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు.

Next Story