మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల్లోనే పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. పార్టీ శ్రేణుల్లో సుధాకర్ అని పిలువబడే ఆయనకు గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న వంటి అనేక మారుపేర్లు కూడా ఉన్నాయి.
ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మావోయిస్టు సీనియర్ లీడర్లు ఉన్నట్లు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మరణించినట్లు సమాచారం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకు చెందిన సుధాకర్ 40 సంవత్సరాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఆయన తలపై ₹1 కోటి బహుమతిని ప్రకటించారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో కూడా ఆయన పాల్గొన్నారు.