ఆదోనిలో భారీగా పట్టుబడిన బంగారం
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని పట్టణంలో భారీగా బంగారం పట్టుబడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 3:45 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని పట్టణంలో భారీగా బంగారం పట్టుబడింది. బంగారు వ్యాపారులు, ఏజెంట్లు కేరళ నుంచి 13 కిలోల బంగారు బిస్కెట్లు ఆదోని పట్టణానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు పుణె ఎక్స్ప్రెస్లో తనిఖీ చేయగా 12 మంది బంగారాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆదోనికి చెందిన కొంతమంది బంగారం వ్యాపారులు 13 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు ఎర్నాకుళంలో కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఆదోని రైల్వే స్టేషన్ నుండి పలు నగరాలకు రైలు సౌకర్యం ఉంది. పెద్దగా చెకింగ్ లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. కొందరు బంగారం వ్యాపారులు ఎలాంటి బిల్లులు లేకుండా జీరో పద్ధతిన బంగారం తీసుకుని వస్తున్నారు. కేరళ, చెన్నై, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుండి ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండానే రైలు మార్గం ద్వారా బంగారాన్ని ఆదోనికి తెస్తున్నారు.