జనసేనకు 70కి పైగా సీట్లు ఇవ్వాలి..!
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - Medi Samrat |
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 70కి పైగా స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని, కేవలం 21 సీట్లు ఇస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం గణనీయంగా పెరిగిందని, భవిష్యత్తులో సీట్ల సర్దుబాటులో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని కిరణ్ రాయల్ అన్నారు. పవన్ కల్యాణ్ లేకపోతే టీడీపీ ఎన్నికల బరిలో నిలబడటమే కష్టమయ్యేదన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉంటే, పవన్ ముందుకొచ్చి కూటమి ఏర్పాటు చేసి వారికి ధైర్యం ఇచ్చారన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడానికి గల కారణాలను కూడా కిరణ్ రాయల్ వివరించారు. రాజకీయాల్లో ప్రజాబలంతో పాటు ఆర్థిక బలం కూడా అవసరమని, ఆ సమయంలో ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నానని తెలిపారు.