టీటీడీ పాల‌క మండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

Key Decisions On TTD Governing Body Meeting. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షుడు వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న శ‌నివారం తిరుమల

By Medi Samrat  Published on  11 Dec 2021 3:05 PM GMT
టీటీడీ పాల‌క మండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షుడు వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న శ‌నివారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు స‌మావేశం జరిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 13వ తేదీ నుండి 10 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం తరహాలోనే వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచితంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది ధర్మకర్తల మండలి.

క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే కొత్త సంవ‌త్స‌రంలో మ‌రింత ఎక్కువ మంది భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంతో పాటు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌కు అనుమ‌తించాల‌ని యోచిస్తున్నాం. ఇందుకోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు లేఖలు రాయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీ వేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా మార్చేందుకు స్థ‌లాన్ని గుర్తించారు. దీంతో వెంట‌నే ఆసుప‌త్రి నిర్మాణం చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఇందుకోసం ఎస్వీ ప్రాణ‌దాన ట్ర‌స్టు ద్వారా విరాళాలు అందించే దాత‌ల‌కు ఉద‌యాస్త‌మాన సేవా టికెట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుమ‌లలో హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లమైన అంజ‌నాదేవి ఆల‌య ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల‌ని, నాద‌నీరాజ‌నం వేదికను భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దేందుకు మండ‌పం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రెండింటిని దాత‌ల విరాళాల‌తో నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

అన్న‌మ‌య్య కాలిబాట మార్గాన్ని మ‌రో న‌డ‌క‌మార్గంగా అభివృద్ధి చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్‌ రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మండ‌లి స‌మావేశంలో ఆమోదం తెలిపారు. భక్తుల తలనీలాలు తీసే కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్‌ ఒక్కింటికి రూ.11/- నుండి రూ.15/-కు పెంచేందుకు ఆమోదం తెలిపారు. కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణాలు లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాలను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

రూ.3 కోట్ల వ్యయంతో యాత్రికుల సౌకర్యార్థం తిరుమలలోని ఏఎన్సీ, జీఎన్సీ, హెచ్ వీసీ తదితర విశ్రాంతి గృహాల్లో వాటర్‌ హీటర్లు ఏర్పాటుకు గాను టెండర్లు పిలిచేందుకు మండ‌లి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా రాజంపేట స‌మీపంలోని అన్న‌మ‌య్య డ్యామ్ ప‌రివాహ‌క ప్రాంతంలో ధ్వంస‌మైన 7 ఆల‌యాలను పున‌ర్నిర్మించాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీలో పరిపాలన పరమైన పలు నూతన అప్లికేషన్లలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా.. ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

రూ.10 కోట్ల వ్యయంతో స్విమ్స్‌ లో సెంట్రల్‌ గోడౌన్‌ భవన నిర్మాణానికి అనుమతి మంజూరవ‌డంతో ఆమోదం తెలిపారు. రూ.12.58 కోట్ల వ్యయంతో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలోని హరిణి హాస్టల్‌ బ్లాక్‌ లో అదనపు అంతస్థుల నిర్మాణానికి, శ్రీనివాస, గాంధీ హాస్టళ్లలో గదులను ఆధునీకరణ చేసేందుకు టెండర్లకు ఆమోదం తెలిపింది మండ‌లి. రూ.2.80 కోట్లతో తిరుమలలో నిర్మాణంలో ఉన్న‌ పరకామణి భ‌వ‌నంలో నాణేలను లెక్కించి ఆటోమేటిక్‌గా ప్యాకింగ్‌ చేసేందుకు వీలుగా రెండు యంత్రాల ఏర్పాటుకు టెండర్లకు ఆమోదం తెలిపారు. శ్రీశైలంలోని శ్రీశైల దేవస్థానం శివాజీ గోపురానికి గాను వారి నిధులతో రాగి కళశాలపై బంగారు తాపడం చేసి అందించేందుకు ఆమోదం తెలిపారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో శ్రీ వేంకటేశ్వర తాళపత్ర గ్రంథ ప్రాజెక్టు ఏర్పాటుకు మండ‌లి నిర్ణయం తీసుకుంది.


Next Story