కృష్ణా జలాలపై తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్

Jagan strong comments on water disputes with telangana. కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో వివాదం కొనసాగుతోంది. మొదటిసారి ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  8 July 2021 1:32 PM GMT
కృష్ణా జలాలపై తొలిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్

కృష్ణా జలాల విషయంలో తెలంగాణతో వివాదం కొనసాగుతోంది. మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగంగా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పుకొచ్చారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని.. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్నారు.

జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని.. నీటి కేటాయింపుపై గతంలోనే అగ్రిమెంట్స్ జరిగాయని గుర్తు చేశారు. ఒప్పందం ప్రకారం కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటున్నామని, ఎవరికి ఎంత కేటాయింపులు ఉన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు (రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు) కేటాయించారని అన్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులని.. 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని తెలిపారు. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ ప్రశ్నించారు.

మీకు కేటాయించిన నీరు మీరు వాడుకుంటే తప్పులేదు, మాకు కేటాయించిన నీరు మేం వాడుకుంటే తప్పా అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. బైరవాని తిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడుతామని జగన్ చెప్పారు. ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూసేకరణ జరగాలన్నారు.


Next Story