High Court key orders on consensus. పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు
By Medi Samrat Published on 13 Feb 2021 3:39 AM GMT
పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గంగా మాచర్ల ముందుంది. గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచర్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది.
అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు,172 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపిస్తోంది. బలవంతపు ఏకగ్రీవాలు, బెదిరింపులు, కిడ్నాప్లకు ఏపీ పంచాయతీ ఎన్నికలు వేదిక అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.