బిపిన్ రావత్ తో పాటూ మరణించిన వారిలో తెలుగు జవాన్ సాయి తేజ

Helicopter crash kills AP resident Sai Tej. భారత సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన

By Medi Samrat  Published on  8 Dec 2021 3:16 PM GMT
బిపిన్ రావత్ తో పాటూ మరణించిన వారిలో తెలుగు జవాన్ సాయి తేజ

భారత సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. చిత్తూరు జిల్లా కురుబలకోట వాసి సాయితేజ ఈ ప్రమాదంలో అసువులు బాసాడు. లాన్స్‌ నాయక్‌ హోదాలో సాయితేజ్‌ రావత్‌ పర్సనల్‌ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. సాయితేజ్‌ భార్యతో చివరిసారిగా బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్.

సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ హెలీకాప్టర్ లో ప్రయాణిస్తున్న జనరల్ రావత్ భార్య కూడా మరణించారు. ఈ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న జనరల్ బిపిన్ రావత్, శ్రీమతి మధులికా రావత్, మరో 11 మంది వ్యక్తులు మరణించారని నిర్ధారించబడిందని భారత వైమానిక దళం (IAF) ట్వీట్ చేసింది.


Next Story