రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Heavy Rain alert for Telugu States.తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 7:57 AM GMT
రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం తెలిపింది. ఒడిశా తీరంలో 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింద‌ని చెప్పింది. దీని ప్ర‌భావంతో ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీచేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ‌కు వదిలారు. మరోసారి భారీ వర్ష సూచన ఉండడంతో పలు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులకు దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Next Story