ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. తోతాపూరి మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దిగుబడి ఎక్కువ ఉండటంతో మామిడి పంటను పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాలని, 4 రూ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. కేజీ 12 రూ చొప్పున రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మం త్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సబ్సీడి నగదులో 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి అచ్చెన్నాయుడు అభ్యర్ధనని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్రకటించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్ధతు ధరను చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ విషయం పట్ల తోతాపూరి మామిడి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడు కి, మంత్రి అచ్చెన్నాయుడు కి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.