ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది. అది కూడా ఎక్కడో కాదు రాజధాని అమరావతిలో. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. రాష్ట్రప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గూగుల్ ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఇందుకుగాను అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నారని తెలిసింది.
ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి శుక్రవారం రోజున నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రవాణా సౌకర్యాల సామీప్యత కారణంగానే గూగుల్ ప్రతినిధులు ఈ నిర్దిష్ట స్థలం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ అంశాలన్నీ గూగుల్ తమ ప్రాజెక్టును ఇక్కడ స్థాపించడానికి సానుకూలంగా దోహదపడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.