గన్నవరం వైసీపీలో తారా స్థాయికి విభేదాలు..
Gannavaram YSRCP leaders issue. గన్నవరం వైఎస్సార్సీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
By Medi Samrat
గన్నవరం వైఎస్సార్సీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు అంటూ మాటల యుద్ధం జరుగుతూ వస్తోంది. రామచంద్రరావు తాను వంశీతో కలిసి పని చేయలేనని చెప్పుకొచ్చారు. వంశీతో కలిసి పనిచేయలేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. తాను గుంపులుగా ఎన్నికలకు వెళ్లలేదని, ఒంటరిగా వెళ్లానని.. వంశీ బీజేపీ, జనసేన, వామపక్షంతో కలిసి పోటీ చేసి గెలిచారన్నారు. వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే పనిచేయనని తేల్చి చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చి 38 ఏళ్లవుతోందని.. ఒక్కసారి కూడా చంద్రబాబును ఇప్పటి వరకు చూడలేదని.. కేవలం టీవీ, పేపర్లో మాత్రమే చూశానన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ల గురించి తాను స్పందించనన్నారు. ఇప్పటి వరకు తనకు పదవి కావాలని ఎవర్నీ అడగలేదని.. జగన్ పిలిచి తనకు టికెట్ ఇచ్చారన్నారు. వంశీ కోసం పనిచేయనని.. వైఎస్సార్సీపీకి ఓటు వేసి ఇంట్లో కూర్చుంటానన్నారు. వల్లభనేని వంశీ కేవలం 800 మెజార్టీతోనే గెలిచారని.. ఆయన ఆకాశం నుంచి ఊడిపడలేదన్నారు. 2014లో కూడా జనసే, బీజేపీతో కలిసి పోటీచేసి విజయం సాధించారన్నారు. తన తండ్రి 11 ఎకరాల పొలం ఇస్తే.. తాను 8 ఎకరాలు మిగిల్చానన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక మూడు ఎకరాలు అమ్ముకున్నట్లు చెప్పుకొచ్చారు. గన్నవరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లే వ్యక్తిని కాదన్నారు.