గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించారు. తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు రాగా, జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించారు. గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై పోలీసులు రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మాజీ సీఎం జగన్ చేసిన ఈ పరామర్శలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్లాంటి వారిని చూసే వచ్చిందని విమర్శించారు. గంజాయి బ్యాచ్ను పరామర్శించి రాజకీయంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి అధికారి సునీల్కుమార్తో నన్ను కస్టడీలో కొట్టించింది జగనే. ఆయన్ను చూసి జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేమన్నారు రఘురామ.