ఫెంగల్ తుఫాన్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 30 Nov 2024 1:02 PM IST
ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని ముఖ్యమంత్రి సూచించారు.