పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు.. స్పందించిన హైపర్‌ ఆది

టీడీపీతో పొత్తు విషయంలో జనసేన నేతలు పవన్‌ కల్యాణ్‌ను విమర్శించడంపై ఆ పార్టీ నాయకుడు హైపర్‌ ఆది స్పందించారు.

By అంజి  Published on  27 Feb 2024 3:25 AM GMT
Pawan Kalyan, Hyper Aadi, Janasena, APnews

పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు.. స్పందించిన హైపర్‌ ఆది

టీడీపీతో పొత్తు విషయంలో జనసేన నేతలు పవన్‌ కల్యాణ్‌ను విమర్శించడంపై ఆ పార్టీ నాయకుడు హైపర్‌ ఆది స్పందించారు. ''ఒక నిజమైన జన సైనికుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావ్ ఆది'' అని నాగబాబు ఆ వీడియోను షేర్‌ చేశారు. ''ఎక్కువ సీట్లు తీసుకుని ఇన్నే గెలిచాడా? అనిపించుకోవడం కంటే.. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలిచాడు అనిపించుకోవడం కరెక్ట్ అని భావించి పవన్‌ 24 సీట్లకే పరిమితమయ్యారు'' అని ఆది ఆ వీడియోలో చెప్పారు. పవన్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని చెప్పాడు. 24 సీట్లకే ఒకే చెప్పడం ఏంటని పవన్‌ గురించి మాట్లాడుతున్నారని, 2019లో పవన్‌ను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్‌ ఆది ప్రశ్నించాడు.

పవన్‌ గొప్ప నాయకుడు, ఆయన తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్నాడని చెప్పాడు. పరీక్షలో ఫెయిల్ అయితేనే మనం 10 రోజులు బయటకు రాలేమని... అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు. కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని, ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టి, అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని, నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పాడు. కాగా జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆది... టాలీవుడ్ లో సైతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. జనసేనాని పవన్ కల్యాణ్ కు హైపర్ ఆది బిగ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.

Next Story