తెలుగు రాష్ట్రాల్లో న‌డిచేవి 'బీజేపీ డబుల్‌ ఇంజిన్‌' ప్రభుత్వాలే : సీపీఐ నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్‌ ముసుగులో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలే న‌డుస్తున్నాయ‌ని

By Medi Samrat  Published on  27 Aug 2023 10:22 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో న‌డిచేవి బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలే : సీపీఐ నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్‌ ముసుగులో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలే న‌డుస్తున్నాయ‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీపీఐ బస్సు యాత్ర గుంటూరుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నిన్న మొన్నటి దాకా మోదీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రానికి జగన్ లొంగిపాయాడు. కేసీఆర్ తన కూతుర్ని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకు బీజేపీ తొత్తుగా మారాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్‌.. కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ బెయిల్‌పై బయట ఉన్నారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌పై బయట ఉండలేదన్నారు. మోదీ – జగన్ డబుల్ ఇంజిన్ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని.. మోదీకి దత్తపుత్రుడిగా జగన్ కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు.

Next Story